అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా వంట గ్యాస్ ధరలు పెంచి మహిళలకు ఇబ్బందులను గురి చేయడమే కేంద్ర ప్రభుత్వం మహిళలకు ఇచ్చే కానుక అని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ.వెంకటస్వామి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ ఆదివారం జిల్లా కేంద్రంలోని వైయస్సార్ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్యాస్ ధరలను పెంచి కేంద్ర ప్రభుత్వం మహిళలకు పెద్ద కానుకే ఇచ్చిందని ఏద్దేవా చేశారు. మహిళల గురించి గొప్పలు మాట్లాడి వారిని మాత్రం వంటగదికి పరిమితం చేయడంలో మనువాద బిజెపి ముందంజలో ఉందన్నారు.బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వంట గ్యాస్,పెట్రోల్, డీజిల్ ధరలు నిరంతరాయంగా పెంచుతున్నదని విమర్శించారు.యుద్ధం నెపంతో వంట గ్యాస్ పై 60 రూపాయలు,వాణిజ్య సిలిండర్ పై 115 రూపాయలు పెంచారని, మరి యుద్ధాలు లేనప్పుడు అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పటికీ భారతదేశంలో ధరలు ఎందుకు పెంచారని ప్రశ్నించారు. ఒకవైపు వంట చెరుకు వాడకాన్ని తగ్గించాలని వాయు కాలుష్యాన్ని నివారించాలని నీతులు చెబుతూ, మరోవైపు ఇష్టా రీతిగా ధరలు పెంచుతూ పేద ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు ఉపాధి లేకుండా చేసి వారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వం మాత్రం నిరంతరం వస్తు సేవల ధరలను పెంచుతూ ఉన్న అర కోర ఆదాయాలకు సైతం కోతలు పెడుతున్నదని విమర్శించారు.రష్యా నుండి చమురు కొనుగోలు చేయడానికి అమెరికా అనుమతి దేనికని ప్రశ్నించారు.సామ్రాజ్యవాద దేశాలకు భయపడి దేశ సార్వభౌమత్వాన్ని అమెరికాకు తాకట్టుపెట్టడం ఏమిటని ప్రశ్నించారు.సామ్రాజ్యవాద దురహంకారంతో అమెరికా ఇజ్రాయిల్ దేశాలు కలిసి ఇరాన్ పై చేస్తున్న దాడుల వల్లే ధరలు పెరుగుతున్నాయని తెలిపారు.యుద్ధం ఇంకా కొనసాగితే భారతదేశం సైతం తీవ్ర ఆర్థిక మాంద్యానికి ఎదురవుతుందని హెచ్చరించారు. తక్షణమే ఇరాన్ పై దాడులను ఆపి శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో దీర్ఘకాల ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఉప్పేర్ నరసింహ, కార్మికులు లక్ష్మన్న, నరేష్, గజేంద్ర,ఎలప్ప, వీరేష్,రామకృష్ణ, అంజి తదితరులు పాల్గొన్నారు.
ధన్యవాదాలతో ఏ. వెంకటస్వామి సీపీఎం జిల్లా కార్యదర్శి జోగులాంబ గద్వాల జిల్లా
