ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్న్యూస్. త్వరలోనే ఎలాంటి రద్దీ లేకుండా టెన్షన్ ఫ్రీ జర్నీ చేయెుచ్చు. ఈ మేరకు ఆర్టీసీకి కొత్త బస్సులు అందుబాటులోకి రానున్నాయి. మహిళా సంఘాల సమాఖ్యల నుంచి ఆర్టీసీ అద్దె ప్రతిపాదికన బస్సులను తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఈ బస్సులను నడుపుతుండగా.. 200 బస్సులు రోడ్డెక్కేందుకు సిద్ధమయ్యాయి.
- ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్న్యూస్
- రోడ్డెక్కనున్న మహిళా సంఘాల బస్సులు
- ఇక బస్సుల్లో టెన్షన్ ఫ్రీ జర్నీ
తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోంది. రాష్ట్రంలోని కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయటమే లక్ష్యంగా వారి కోసం ప్రత్యేకంగా పథకాలు అమలు చేస్తోంది. ఇప్పటికే మహిళా పొదుపు సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్బంక్, ఆహార పరిశ్రమలు ఏర్పాటు చేయించింది. ఇందిరా మహిళా శక్తి పథకం కింద పొదుపు సంఘాల డబ్బులతో టీజీఎస్ఆర్టీసీ భారీగా బస్సులను సమకూర్చుకుంటోంది. గతేడాది మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని సీఎం రేవంత్రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.
ప్రస్తుతం 152 బస్సులను మహిళా సంఘాల సమాఖ్యలు ఆర్టీసీకి అద్దెకిచ్చారు. ఆయా బస్సులకు డ్రైవర్లు, కండక్టర్లను ఆర్టీసీనే సమకూర్చింది. ఒక్కో బస్సుకు ఆర్టీసీ నెలకు రూ.69,468 చొప్పున అద్దె చెల్లిస్తోంది. తాజాగా మరో కొన్ని బస్సులు రోడ్డెక్కేందుకు సిద్ధమయ్యాయి. 200 బస్సులకు బాడీ బిల్డింగ్ పూర్తయ్యి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. మరో 248 బస్సులు వచ్చే (మార్చి) నెలాఖరునాటికి సిద్ధం అవుతాయని చెబుతున్నారు. ఇప్పటికే తిరుగుతున్న బస్సులకు తోడు.. సిద్ధంగా ఉన్న 200 బస్సుల్ని వీలైనంత తొందరగా ప్రారంభించాలని ఆర్టీసీ భావిస్తోంది. సర్కార్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఈ బస్సులను రోడ్డెక్కించే ఛాన్స్ ఉంది. గతేడాది ప్రవేశపెట్టిన 152 బస్సులకు పైలట్ ప్రాజెక్టు కింద మహబూబ్నగర్, కరీంనగర్, వరంగల్ జిల్లాలను ఎంపిక చేశారు. మహిళా సంఘాల నుంచి రుణాలు తీసుకున్న నేపథ్యంలో ఈ బస్సుల్ని ఆయా సంఘాలకు ఆర్టీసీ హైపోథికేషన్ చేయించింది.
గతంలో ప్రైవేటు వ్యక్తుల నుంచి బస్సులను అద్దెకు తీసుకొని ఆర్టీసీ సంస్థ నిర్వహించేది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించేందుకు మహాలక్ష్మి పథకం అమలు చేశారు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. జిల్లా బస్సుల్లో అయితే కాలు పెట్టేందుకు కూడా జాగా ఉండటం లేదు. దీంతో ఆర్టీసీకి అదనపు బస్సుల అవసరం ఏర్పడింది. మహిళా సంఘాల ద్వారా బస్సులు సమకూరడంతో ఆర్టీసీపై ప్రస్తుతం ఒత్తిడి తగ్గింది. ప్రయాణికులు కూడా టెన్షన్ ఫ్రీ జర్నీ చేస్తున్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఆర్టీసీకి 600 బస్సులు అద్దెకు ఇవ్వాలనేది టార్గెట్గా పెట్టుకున్నారు. తొలివిడతలో 152 బస్సులు మంజూరు చేయగా.. మిగతా 448 బస్సులు కూడా ఇవ్వాలని సెర్ప్ నిర్ణయించింది. తాజాగా 200 బస్సులు అందుబాటులోకి వస్తుండగా. మిగిలిన బస్సులు సైతం రోడ్డెక్కనున్నాయి.
